టీడీపీతో నియోజకవర్గ స్థాయి కార్యాచరణకు జనసేన ఇన్చార్జుల నియామకం... ఆమోదం తెలిపిన పవన్ కల్యాణ్

  • ఏపీలో జనసేన-టీడీపీ మధ్య పొత్తు
  • నియోజకవర్గ స్థాయిలో సమన్వయం కోసం ఇన్చార్జుల నియామకం
  • 'పాయింట్ ఆఫ్ కాంటాక్ట్' లుగా నియామకం
జనసేన-టీడీపీ పొత్తు కార్యాచరణలో మరో ముందడుగు పడింది. జనసేన-టీడీపీ మధ్య నియోజకవర్గ స్థాయిలో చేపట్టే సమావేశాలు, ఉమ్మడి కార్యక్రమాల నిర్వహణకు జనసేన తరఫున ఇన్చార్జులను నియమించారు. ఈ నియామకాలకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆమోదం తెలిపారు. 

ఈ ఇన్చార్జిలను 'పాయింట్ ఆఫ్ కాంటాక్ట్' లుగా పరిగణిస్తారు. టీడీపీతో జనసేన సమావేశాలు, ఇరు పార్టీలు ఉమ్మడిగా నిర్వహించే కార్యక్రమాలను సమన్వయ పరచడం వీరి విధి. రేపటి నుంచి మూడ్రోజుల పాటు రాష్ట్రంలో జనసేన-టీడీపీ ఆత్మీయ సమావేశాలు నిర్వహించనున్నారు. 

జనసేన-టీడీపీ సమన్వయ కమిటీ నిర్ణయించిన అజెండా మేరకు పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో ఏంచేయాలన్నది తాజాగా నియమితులైన ఇన్చార్జిలు ఆత్మీయ సమావేశాల్లో వివరించనున్నారు. 

ఈ నెల 17 నుంచి నియోజకవర్గ స్థాయిలో ఇంటింటికీ కార్యక్రమం చేపట్టనున్నారు. ఇందులోనూ ఇన్చార్జిల పాత్ర ఉంటుంది. ప్రజలను కలిసి భవిష్యత్తుకు గ్యారెంటీపై వివరించడం, ఓటరు జాబితాల పరిశీలన తదితర అంశాలను విజయవంతం చేసేందుకు వీరు కార్యాచరణ రూపొందిస్తారు.

Janasena
Incharges
Pawan Kalyan
TDP
Andhra Pradesh

More Telugu News